-
రవీంద్రభారతిలో ఘనంగా డా. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు
-
కరుణాకర్కు అవార్డు ప్రదానం చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
-
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో మిన్నంటిన హర్షం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: దళిత, బహుజన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్ సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా ఆయనను ప్రతిష్టాత్మక “దళిత రత్న” పురస్కారం వరించింది.
డా. బాబు జగ్జీవన్ రామ్, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ ల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. దళిత, బహుజన, పేద ప్రజల సంక్షేమం కోసం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం మల్యాల కరుణాకర్ క్షేత్రస్థాయిలో చేస్తున్న నిరంతర కృషిని ఉత్సవ కమిటీ గుర్తించింది. ఆయన సేవలకు తగిన సత్కారం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
నిబద్ధత కలిగిన నాయకుడు.. దళితుల గొంతుక.!
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణల చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. కరుణాకర్కు శాలువా కప్పి, మెమెంటో అందజేసి దళిత రత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కరుణాకర్ పార్టీ కోసం, ప్రజల కోసం ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న అరుదైన నాయకుడు అని కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లాలో దళితుల హక్కుల సాధనలో, వారి సమస్యల పరిష్కారంలో కరుణాకర్ గారు ఒక బలమైన గొంతుకగా పోరాడుతున్నారు. ఈ అవార్డు ఆయన నిస్వార్థ సేవలకు దక్కిన నిజమైన గుర్తింపు అని ప్రశంసించారు.

నన్ను నమ్మిన ప్రజలకే ఈ అవార్డు అంకితం : మల్యాల కరుణాకర్
దళిత రత్న అవార్డు స్వీకరించిన అనంతరం మల్యాల కరుణాకర్ మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ అవార్డు నా ఒక్కడికి దక్కిన గౌరవం కాదు.. నన్ను గుండెల్లో పెట్టుకున్న గుడిహత్నూర్ ప్రజలకు, అహర్నిశలు నాతో పాటు శ్రమిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కిన గౌరవం. డా. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ గార్ల బాటలో నా తుది శ్వాస వరకు పేదల పక్షానే నిలబడతాను,” అని ఆయన స్పష్టం చేశారు.కరుణాకర్కు అవార్డు రావడం పట్ల ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్ పర్సన్ మేతరి రోజా రాణి, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పెరమండ్ల రామకృష్ణలతో పాటు పలువురు దళిత, బహుజన సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, విశేష సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

