వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్ : భారతదేశంలో బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డును తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్ష రూపాయల మార్క్ను దాటేసింది. మన దగ్గర చిన్న గోల్డ్ కాయిన్ కొనాలంటేనే నెల జీతం సరిపోని పరిస్థితి. కానీ ప్రపంచంలో ఒక దేశం మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన దృశ్యాన్ని చూపిస్తోంది.
అక్కడ బంగారం ధర మీ ఉదయపు టీ లేదా టిఫిన్ ఖర్చుకంటే కూడా తక్కువగా ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఆ దేశమే దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న వెనిజులా.
వెనిజులాలో ప్రస్తుతం బంగారం ధరలు వినిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. అక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర భారతీయ కరెన్సీలో లెక్కిస్తే సుమారు రూ.180 వరకు మాత్రమే ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం అయితే ఇంకా తక్కువగా రూ.160ల పరిధిలో లభిస్తోంది.
అంటే భారత్లో మనం ఒక కప్పు టీకి లేదా పాలు–బ్రెడ్ ప్యాకెట్కు ఎంత ఖర్చు చేస్తామో, దాదాపు అదే ధరకే వెనిజులాలో ఒక గ్రాము బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దీని వెనుక ఉన్న వాస్తవం మాత్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది.
వెనిజులాలో బంగారం ఇంత చవకగా ఉండటం ఆ దేశ సంపదకు సూచిక కాదు. అది అక్కడ పూర్తిగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబం. ఒకప్పుడు చమురు సంపదతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఈ దేశం, నేడు కరెన్సీ విలువను దాదాపు పూర్తిగా కోల్పోయింది.
వెనిజులా కరెన్సీ ‘బోలివర్’ తీవ్రమైన ద్రవ్యోల్బణంతో విలువ లేకుండా మారిపోయింది. చేతిలో నోట్లు ఉన్నా, వాటితో కనీస అవసరాలైనా కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభంలో భాగంగా దేశం తన బంగారు నిల్వలను కూడా భారీగా వినియోగించింది.
అప్పులు తీర్చడం, విదేశీ లావాదేవీలు నిర్వహించడం కోసం వేల టన్నుల బంగారాన్ని విదేశాలకు తరలించారు. అంతర్జాతీయ ఆంక్షలు, రాజకీయ అస్థిరత, అంతర్గత అవినీతి కలిసి అక్కడి మార్కెట్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా స్థానికంగా బంగారం విలువ పడిపోయింది.
ఇది ఎంత విరుద్ధంగా ఉన్నా, వెనిజులా సహజ వనరుల పరంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వలు ఈ దేశం వద్ద ఉన్నాయి. ఒరినోకో మైనింగ్ ఆర్క్ ప్రాంతంలో వేల టన్నుల బంగారం మరియు ఇతర ఖనిజాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి.

అయితే సరైన పాలన లేకపోవడం, తప్పుడు విధానాలు, రాజకీయ సంక్షోభం కారణంగా నేడు అక్కడ బంగారం మట్టి ధరకే దొరుకుతున్నా, సామాన్య ప్రజలకు రోజుకు రెండు పూటలా భోజనం దొరకడమే పెద్ద సవాలుగా మారింది.
భారతదేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో, టీ ధరతో బంగారం దొరికే వెనిజులా కథ ప్రపంచానికి ఒక హెచ్చరికగా మారింది. సంపద ఉన్నా సరైన ఆర్థిక నిర్వహణ లేకపోతే ఒక దేశం ఎలా సంక్షోభంలోకి జారిపోతుందో చెప్పే ప్రత్యక్ష ఉదాహరణ ఇదే.
Author: Qamar SD
