📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessGoldGold Updates | బంగారం అలారం మోగిస్తోంది..! ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముందు పెద్ద షాక్‌నా..?

Gold Updates | బంగారం అలారం మోగిస్తోంది..! ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముందు పెద్ద షాక్‌నా..?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏదో తేడా జరుగుతోందా..? మార్కెట్ల నాడి వేగంగా మారుతోంది. పెట్టుబడిదారుల మనస్తత్వం ఒక్కసారిగా భయానికి లోనవుతోంది. ఈ మార్పులన్నింటికీ కేంద్రబిందువుగా మారింది ఒక్కటే అది బంగారం. 2026 జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకు 5,300 డాలర్లను దాటి, 5,500 డాలర్లకు చేరడం ప్రపంచ మార్కెట్లను ఉలిక్కిపడేలా చేసింది. ఇది సాధారణ ధరల పెరుగుదల కాదు. ఇది మార్కెట్‌లో దాగి ఉన్న భయానికి, అనిశ్చితికి ప్రతిబింబంగా మారింది.

ఇప్పటివరకు బంగారం ధరలు పెరిగిన ప్రతిసారి లాభాల కోణంలోనే చర్చ జరిగింది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది “క్లాసిక్ క్రైసిస్ ర్యాలీ”. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీయడమే దీనికి కారణం. అమెరికన్ డాలర్ బలహీనత, బాండ్లపై నమ్మకం తగ్గడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ర్యాలీకి బలం చేకూర్చాయి.

గత కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. జపాన్ యెన్ అకస్మాత్తుగా బలపడటం, ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతానికి అమెరికా యుద్ధ నౌకల తరలింపు పెట్టుబడిదారుల్లో ఆందోళనను మరింత పెంచాయి. మరోవైపు, నిశ్శబ్దంగా ముడిచమురు ధరలు కూడా ఎగబాకుతున్నాయి. ఇవన్నీ కలిసి మార్కెట్‌లో “రిస్క్ అవాయిడెన్స్” వాతావరణాన్ని సృష్టించాయి. ఈ పరిణామాల మధ్య స్పాట్ గోల్డ్ జనవరి 28న ఔన్సుకు 5,500 డాలర్లను దాటింది. వెండి ధరలు కూడా ఏకంగా 50 శాతానికి పైగా పెరిగాయి. ఇది కేవలం రిటైల్ పెట్టుబడిదారుల నిర్ణయం మాత్రమే కాదు. కేంద్ర బ్యాంకులు, పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు కూడా బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఆసియా, మధ్యప్రాచ్య దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి.

ఈ ర్యాలీకి మరో కీలక కారణం జపాన్ పరిణామాలే. అక్కడ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు, క్యారీ ట్రేడ్ తిరిగి మళ్లడం వల్ల యెన్ బలపడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సురక్షిత ఆస్తుల వైపు పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఇదే సమయంలో అమెరికా ఫెడ్ పాలసీలు, రాజకీయ అనిశ్చితి, వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం బంగారానికి మరింత డిమాండ్‌ను సృష్టించాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ పరిస్థితికి మరింత బలం చేకూర్చింది. ఆ నివేదిక ప్రకారం, ప్రస్తుత బంగారం ధరలు కేవలం ఆస్తి విలువను మాత్రమే సూచించడం లేదు. అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతున్న లోతైన పగుళ్లకు హెచ్చరికగా పనిచేస్తున్నాయి. “బంగారం ఇప్పుడు లగ్జరీ కాదు, సిస్టమిక్ రిస్క్ ఇండికేటర్”గా మారిందని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఈ ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుంది అన్నది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. వచ్చే 30 నుంచి 60 రోజుల్లో బంగారం ధరలు పీక్స్‌ను తాకి తగ్గుతాయా? లేక ప్రపంచ ఆర్థిక అస్థిరత మధ్య దీర్ఘకాలిక వృద్ధి దిశగా అడుగులు వేస్తాయా.? అన్నది స్పష్టతకు రావాల్సి ఉంది. UBS, నౌమ్రా వంటి ప్రముఖ బ్రోకరేజీలు కూడా జాగ్రత్తతో కూడిన వ్యూహాలనే సూచిస్తున్నాయి.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం, వెండి ఇకపై కేవలం పెట్టుబడి సాధనాలు మాత్రమే కావు. అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెడ్జ్ ఆయుధాలుగా మారాయి. ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్న సంకేతాలను విస్మరించడం ప్రమాదకరమనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Gold prices surge to record highs amid global economic uncertainty and recession fears
Image credit : AI

బంగారం ధరల రికార్డు ర్యాలీ మార్కెట్ లాభాల కంటే భయాన్ని ఎక్కువగా ప్రతిబింబిస్తోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త మాంద్యం అంచున ఉందా..? అన్న ప్రశ్నకు బలమైన సంకేతం. రాబోయే రోజుల్లో ఆర్థిక విధానాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలే దిశను నిర్ణయించనున్నాయి.

Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team, Published: January 30, 2025 | 08:50 AM

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page