• ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక
• గ్రామాల అభివృద్ధి, హక్కుల సాధనే లక్ష్యం
• మద్దతు తెలిపిన 21 గ్రామ పంచాయతీల ఉపసర్పంచులు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండలంలోని ఉపసర్పంచుల మధ్య సమన్వయం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఫోరం నూతన అధ్యక్షుడిగా సుద్దుల అరుణ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఇట్టేడి రమణారెడ్డి, బండారి స్వామి, ప్రధాన కార్యదర్శిగా మామిడి సంతోష్, కోశాధికారిగా పుండ్రు విజయరాజా రెడ్డి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా గోడం భీమరావు, సుందర్ సింగ్, దొమ్మటి రాజేందర్ బాధ్యతలు స్వీకరించగా.. ఫోరం గౌరవ అధ్యక్షుడిగా తలంపుల రమేష్ను సభ్యులు ఎన్నుకున్నారు.
సమిష్టి కృషితో గ్రామాల అభివృద్ధి:
ఈ సమావేశంలో బోథ్ మండల పరిధిలోని 21 గ్రామ పంచాయతీల ఉపసర్పంచులు పాల్గొని, నూతన కమిటీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లో సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉపసర్పంచులంతా ఐక్యంగా అడుగులేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులకు నూతన కమిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం ఫోరం వేదికగా నిరంతరం పోరాడుతామని, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని వారు స్పష్టం చేశారు.
