-
ఐదు రాష్ట్రాల తీర్పుపై దేశవ్యాప్త ఉత్కంఠ… గతం నేర్పుతున్న పాఠాలేంటి.?
-
బెంగాల్, తమిళనాడు, కేరళలో సర్వేల తికమక
-
గతంలో బోర్లా పడిన అంచనాలు ఎన్నెన్నో..
-
ఈసారి కూడా ‘సైలెంట్ ఓటరే’ కింగ్ మేకర్..!
-
అసలు నిజం నాలుగో తేదీనే..
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. నాలుగో తేదీన రాబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? బెంగాల్ పీఠం నిలబెట్టుకుని ‘దీదీ’ హ్యాట్రిక్ కొడుతుందా, లేక కమలం వికసిస్తుందా? తమిళనాట స్టాలిన్ దే అధికారమా? కేరళలో వామపక్షాల ఆనవాయితీ కొనసాగుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే సమయం దగ్గరపడింది.
కౌంటింగ్ కు ముందే ‘ఎగ్జిట్ పోల్స్’ రూపంలో వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రజల ముందు ఉంచాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కానీ, అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది… ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఓటరు నాడిని ఈ సంస్థలు నిజంగానే పసిగట్టాయా?
గందరగోళంలో అంచనాలు..
ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చే ఒక ట్రైలర్ లాంటివి. ఈసారి వచ్చిన సర్వేలను గమనిస్తే.. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని కొన్ని సంస్థలు చెబుతుంటే, దీదీ దే ఏకపక్ష విజయం అని మరికొన్ని అంచనా వేశాయి. అటు తమిళనాడు, కేరళల్లోనూ ఒక్కో సంస్థది ఒక్కో లెక్క. ఈ భిన్నమైన అంచనాలు సామాన్యులను, రాజకీయ నాయకులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంటే వేదవాక్కు కాదు. గతం పేజీలు తిరగేస్తే ఈ సర్వే సంస్థలు బోర్లా పడిన సందర్భాలు కోకొల్లలు. గతంలో పశ్చిమ బెంగాల్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక జాతీయ సర్వే సంస్థలు సైతం డీలా పడ్డాయి. వారు ఇచ్చిన నంబర్లకు, ఈవీఎంలలో వచ్చిన ఫలితాలకు ఏమాత్రం పొంతన లేదు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ విషయానికి వస్తే ఓటరు ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటాడు. పైకి ఒక మాట చెప్పి, పోలింగ్ బూత్ లో వేరే బటన్ నొక్కుతాడు. గత పదేళ్ల ఎన్నికల చరిత్ర చూస్తే… సర్వేలు ఒకరి వైపు మొగ్గు చూపితే, ప్రజలు మరొకరికి పట్టం కట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
అంచనాలు ఎందుకు తప్పుతాయి..?
లక్షల మంది ఓటర్లు ఉన్న ఒక నియోజకవర్గంలో కేవలం కొద్ది మందిని అడిగి మొత్తం తీర్పును అంచనా వేయడం సాంకేతికంగా లోపభూయిష్టమే. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యుడు, సర్వే ప్రతినిధుల ముందుకు రాగానే తన మనసులోని మాటను భయం లేకుండా చెప్పగలడా? ‘సర్వే వాళ్లకు నిజం చెబితే… స్థానిక నాయకులతో ఏమైనా చిక్కులొస్తాయేమో’ అన్న భయం ఎగ్జిట్ పోల్స్ లెక్కలను తారుమారు చేస్తుంది. దీన్నే రాజకీయ పరిభాషలో సైలెంట్ ఓటర్ ఫ్యాక్టర్’ అంటారు. బెంగాల్ లోని రాజకీయ పరిస్థితులు, కేరళలోని స్థానిక సమస్యలు, తమిళనాడులోని సామాజిక సమీకరణాలు… ఇవన్నీ ఎక్సెల్ షీట్లలో కచ్చితంగా లెక్కకట్టలేనివి.
ఈవీఎంలలోనే అసలు నిజం..
కొన్ని సంస్థల ట్రాక్ రికార్డ్ బాగున్నప్పటికీ, ఏ సంస్థ కూడా వందశాతం కచ్చితమైన ఫలితాలను ఇవ్వలేకపోయింది. సర్వే అనేది కేవలం గాలి ఎటు వీస్తుందో చెప్పే ఒక ‘ట్రెండ్’ ను మాత్రమే సూచిస్తుంది. కాబట్టి, ఎగ్జిట్ పోల్స్ ని చూసి గెలుస్తున్నామని నాయకులు సంబరాలు చేసుకున్నా, ఓడిపోతున్నామని కార్యకర్తలు కుంగిపోయినా అది తొందరపాటే. ఈ అంచనాలు కేవలం టీవీ డిబేట్లకు, పత్రికల్లో విశ్లేషణలకు మాత్రమే పరిమితం.
అసలైన పోల్, ప్రజల పోల్… ఆ ఈవీఎంల స్ట్రాంగ్ రూముల్లోనే భద్రంగా ఉంది. నాలుగో తేదీన ఆ ఈవీఎంలు తెరుచుకున్నప్పుడు మాత్రమే అసలు నిజం బయటపడుతుంది. ప్రజల అంతిమ తీర్పు ఏంటో తెలియాలంటే అప్పటివరకు ఈ ఉత్కంఠ భరించాల్సిందే..!
By.. QAMAR

