• రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించం: ఎస్హెచ్ఓ నరేష్ కుమార్
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న మందుబాబులపై ఇచ్చోడ పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు చేపట్టాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మరో ఐదుగురికి జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన నవహరే బాబారావు (33), నేరడిగొండ మండలం కుంటాల గ్రామానికి చెందిన సిడాం సుభాష్ (32), తండ్రి భీంరావు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా, నేరం నిరూపితం కావడంతో న్యాయమూర్తి వీరికి ఒక రోజు జైలు శిక్ష ఖరారు చేశారు.
ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు: ఎస్హెచ్ఓ
ఈ సందర్భంగా ఇచ్చోడ ఎస్హెచ్ఓ కె. నరేష్ కుమార్ మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వాహనదారులే కాకుండా, రోడ్డుపై వెళ్లే అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. “మద్యం సేవించి వాహనం నడపడం నేరం మాత్రమే కాదు, అది ప్రాణాంతకం. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని ఆయన సూచించారు. ఇకపై మండల వ్యాప్తంగా తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
