• ఆకలి తీర్చి ఆదర్శంగా నిలిచిన బీఆర్ఎస్ యువ నేతలు.!
వాస్తవ నేస్తం,భీంపూర్ : దేశానికి అన్నం పెట్టే రైతన్న.. తాను పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆకలి దప్పులతో అలమటిస్తున్నాడు. కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో అహోరాత్రులు మార్కెట్ యార్డుల్లోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో రైతుల కష్టాలను చూసి చలించిపోయిన బీఆర్ఎస్ యువ నాయకులు కేమ శ్రీకాంత్, బక్కి కపిల్ యాదవ్ లు తమ ఉదారత్వం చాటుకున్నారు. పస్తులుంటున్న రైతులకు అన్నదానం చేసి నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు.
కొనుగోళ్లలో జాప్యం.. కుప్పల వద్దే రైతుల పడిగాపులు..
భీంపూర్ మార్కెట్ యార్డులో గత కొన్ని రోజులుగా జొన్న కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను యార్డుకు తెచ్చిన రైతులకు కనీస వసతులు కరువయ్యాయి. ఒకపక్క తూకాలు పూర్తయినా, వాటిని తరలించడానికి (లోడింగ్) లారీలు రాకపోవడంతో రైతులు తమ జొన్న కుప్పల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. ఎండను సైతం లెక్కచేయకుండా, కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సేవా దృక్పథాన్ని చాటుకున్న కేమ శ్రీకాంత్, బక్కి కపిల్ యాదవ్
పంట అమ్ముకునేందుకు వచ్చి పస్తులుంటున్న రైతుల దీనస్థితిని గమనించిన బీఆర్ఎస్ యువ నాయకులు కేమ శ్రీకాంత్, బక్కి కపిల్ యాదవ్ వెంటనే స్పందించారు. రైతుల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సుమారు 250 మంది జొన్న రైతులకు స్వయంగా అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేవలం భోజనం మాత్రమే కాకుండా వేసవి దృష్ట్యా తాగునీటి వసతి కూడా కల్పించారు. స్వయంగా రైతులకు వడ్డించి, వారి పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి.. లారీలు పంపాలి
ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వలనే రైతులు ఈ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్న రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని తరలించడానికి తక్షణమే కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులతో పాటు బీఆర్ఎస్ నేతలు మాడవి లింబాజి, కునరపు అశోక్, పెంట నితిన్, సిడం అశోక్, దినేష్ రాథోడ్ తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
