వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాకుండా, మరణించిన అనాథకు గౌరవప్రదమైన వీడ్కోలు పలికి కౌన్సిలర్ రాము తన ఉదారతను చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 30వ తేదీ జిల్లా కేంద్రంలోని ఆర్కే కాలనీలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బకు గురై స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, అతడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ముందుకు రాని బంధువులు.. అండగా నిలిచిన కౌన్సిలర్..
మృతుడు అనాథ కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని గమనించిన వారు కౌన్సిలర్ రాముకు సమాచారం అందడంతో, ఆయన వెంటనే స్పందించారు. శుక్రవారం కేఆర్కే స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం సదరు అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.సమాజంలో మానవతా విలువలు మృగ్యమవుతున్న ఈ రోజుల్లో, ఒక అనాథకు అండగా నిలిచి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కౌన్సిలర్ రాము బృందాన్ని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో కౌన్సిలర్తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు లింగంపెల్లి శశికాంత్(లయన్స్ గ్రూప్ అధ్యక్షులు) , జనార్దన్, కళ్లెం హరీష్ రెడ్డి, అలీం పాషా (ఆటో యూనియన్ ప్రెసిడెంట్), బోధకుంట రాజు తదితరులు పాల్గొన్నారు.

