📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessపసిడి ధరలకు బ్రేక్ లేదా..? 2026 నాటికి 10 గ్రాముల బంగారం రూ.2 లక్షల దిశగా...

పసిడి ధరలకు బ్రేక్ లేదా..? 2026 నాటికి 10 గ్రాముల బంగారం రూ.2 లక్షల దిశగా దూసుకెళ్తుందా..!

బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. ఒకప్పుడు ఆభరణాల కొనుగోలు పండుగలకే పరిమితమైతే, ఇప్పుడు బంగారం పేరు వినగానే సామాన్యుడికి గుబులు మొదలవుతోంది. తాజాగా వెలువడిన అంతర్జాతీయ నివేదిక పసిడి భవిష్యత్తుపై మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. వాల్ స్ట్రీట్‌కు చెందిన దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బంగారానికి పెరుగుతున్న సురక్షిత పెట్టుబడి డిమాండ్ కారణంగా 2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 5,400 డాలర్ల స్థాయికి చేరే అవకాశముందని పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు, కేంద్ర బ్యాంకుల దూకుడు కొనుగోళ్లు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో 2026 సంవత్సరం చివరనాటికి బంగారం ధర రూ. 2 లక్షలకు వెళ్లనుందా..? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,800 నుంచి 4,900 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. ఈ గ్లోబల్ ర్యాలీ ప్రభావం భారత మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. ముంబై బులియన్ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,55,900 స్థాయిలో ఉంది. అంటే గ్రాముకు దాదాపు రూ.15,600. ఈ స్థాయితో ప్రపంచంలోనే ఖరీదైన బంగారం మార్కెట్లలో భారతదేశం ఒకటిగా మారింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే భారతదేశంలో బంగారం ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం దిగుమతి సుంకాలు, జీఎస్టీ, రూపాయి బలహీనత, అలాగే ఆభరణాలపై వసూలు చేసే మేకింగ్ ఛార్జీలే. భారతదేశం తన బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందువల్ల రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన ప్రతిసారీ బంగారం ధరలు మరింత ఎగబాకుతున్నాయి.

గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు నిజమైతే, ఔన్సుకు 5,400 డాలర్ల ధర అంటే అంతర్జాతీయంగా గ్రాముకు సుమారు 174 డాలర్లు. దీనికి భారతదేశంలో వర్తించే దిగుమతి సుంకాలు, పన్నులు, స్థానిక ప్రీమియంలను కలిపితే 10 గ్రాముల బంగారం ధర రూ.1.7 లక్షల నుంచి రూ.1.9 లక్షల మధ్యకు చేరే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి మారకపు విలువలో మరింత ఒడిదుడుకులు చోటు చేసుకుంటే రూ.2 లక్షల మార్క్‌ను కూడా బంగారం దాటే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

ఈ ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే బంగారం నిల్వలు ఉన్న కుటుంబాలకు ఆస్తి విలువ పెరిగినప్పటికీ, కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గణనీయమైన భారంగా మారుతోంది. ముఖ్యంగా పండుగలు, వివాహాల సీజన్‌లో డిమాండ్ పెరిగితే దేశ దిగుమతి బిల్లుపై, వాణిజ్య లోటుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇక పెట్టుబడిదారుల విషయానికి వస్తే, బంగారాన్ని తాత్కాలిక లాభాల సాధనంగా కాకుండా దీర్ఘకాలిక రక్షణ ఆస్తిగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. భౌతిక బంగారానికి బదులుగా సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వంటి మార్గాలు సౌకర్యవంతమైనవిగా మారుతున్నాయి. అయితే ధరలు ఇప్పటికే ఎత్తులో ఉన్న నేపథ్యంలో దశలవారీగా పెట్టుబడి పెట్టడమే వివేకవంతమైన మార్గమని సూచనలు వినిపిస్తున్నాయి.

Gold price surge in India as Goldman Sachs predicts 10 grams gold may reach ₹2 lakh by 2026
Gold prices surge as global demand rises, raising fears of ₹2 lakh per 10 grams by 2026

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నంత కాలం బంగారానికి డిమాండ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ధరల పెరుగుదల ఒకవైపు పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చినా, మరోవైపు సామాన్య వినియోగదారుడికి ఆందోళన కలిగిస్తోంది. పసిడి ఇక ఆభరణం మాత్రమే కాదు… ఆర్థిక వ్యూహానికి కీలక సాధనంగా మారుతున్న సంకేతాలివి.

Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team,Published: January 24, 2025 | 06:16 PM

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page