వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: ఈ వారం బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులను పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. ఒకరోజు ఉదయం ధరలు ఒక్కసారిగా పెరిగి, సాయంత్రానికి మళ్లీ తగ్గిపోవడం.. మరుసటి రోజు తిరిగి బలంగా ఎగబాకడం వంటి పరిణామాలు మెటల్ మార్కెట్లో స్పష్టమైన దిశలేమిని చూపించాయి. అయితే ఈ గందరగోళానికి ముగింపు సమయం దగ్గరపడుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం, వెండి ధరలు ఇకపై కొత్త అప్ట్రెండ్లోకి ప్రవేశించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఇప్పటికే దేశీయ మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజులోనే రూ.1,000 పెరిగి రూ.1,29,000కు చేరింది. అదే సమయంలో పౌన్ (8 గ్రాములు) బంగారు ఆభరణాల ధర రూ.800 పెరిగి రూ.1,03,200గా నమోదైంది. వెండి ధర మరింత దూకుడుగా కిలోకు రూ.7,000 పెరిగి రూ.2,75,000 స్థాయిని తాకింది. ప్లాటినం ధర కూడా 10 గ్రాములకు రూ.1,020 పెరిగి రూ.65,580గా ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ఔన్స్ ధర 4,460 డాలర్ల నుంచి 4,509 డాలర్ల వరకు ఎగబాకింది. ఈ పెరుగుదల యాదృచ్ఛికం కాదని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా నుంచి విడుదలైన కీలక ఆర్థిక గణాంకాలే బంగారం ధరలకు బలమైన మద్దతు ఇచ్చాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన US ఉద్యోగ నివేదిక అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం మార్కెట్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా సెలవుల కాలంలో ఉద్యోగ సృష్టి ఎక్కువగా ఉండాలి కానీ ఈసారి ఉద్యోగాల సంఖ్య నవంబర్తో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు డేటా వెల్లడించింది.
నిరుద్యోగిత రేటు తక్కువగా ఉన్నప్పటికీ, ఆర్థిక మందగమన సంకేతాలు స్పష్టంగా కనిపించడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై అంచనాలు మారాయి. ఈ ఏడాది ఫెడ్ కనీసం 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి వడ్డీ లేని ఆస్తులపై డిమాండ్ పెరుగుతుంది. దీనికితోడు ట్రంప్ గ్రీన్ల్యాండ్ వ్యాఖ్యలు, యూరోప్-నాటో మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి.
దేశీయంగా MCX మార్కెట్లో కూడా శుక్రవారం చివరికి బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైన నష్టాలను పూర్తిగా తుడిచిపెట్టేశాయి. MCXలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా 0.04 శాతం పెరిగి రూ.1,38,875 వద్ద ముగిసింది. వెండి ధర కేవలం 0.29 శాతం తగ్గి రూ.2,52,002 వద్ద స్థిరపడింది.

మొత్తంగా చూస్తే ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెట్టుబడిదారులకు దాదాపు 4 శాతం లాభాన్ని అందించాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే సమీప కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుదల దిశగా సాగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు ఈ విలువైన లోహాలను ఇకపై సేఫ్ హెవెన్ ఆస్తులుగా మరింతగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: ఈ వెబ్సైట్లో ప్రచురితమైన అభిప్రాయాలు, విశ్లేషణలు పూర్తిగా వ్యక్తిగత నిపుణులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలకు ముందు ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి.
