• లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన హౌసింగ్ శాఖ ఏఈ
వాస్తవ నేస్తం ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిని పట్టుకున్నారు. నార్నూర్ మండలానికి చెందిన హౌసింగ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ దుర్గం శ్రీకాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల మంజూరు కోసం నార్నూర్కు చెందిన ఓ లబ్ధిదారు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీకాంత్ను సంప్రదించగా, బిల్లు మంజూరుకు రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితుడు ఇప్పటికే రూ.10 వేలు చెల్లించినప్పటికీ బిల్లు మంజూరు చేయలేదు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మిగిలిన రూ.10 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు మాటు వేసి అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీకాంత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం దుర్గం శ్రీకాంత్ను ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ చర్యలతో ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం రేగుతోంది.
