ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మలుపు వద్ద నిలిచినట్టే కనిపిస్తోంది. బంగారం ధరలు రాకెట్ వేగాన్ని తలపిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అమెరికా డాలర్పై నమ్మకం క్రమంగా తగ్గిపోవడం, సావరిన్ బాండ్లకు డిమాండ్ క్షీణించడం, ప్రధాన కరెన్సీల నుంచి పెట్టుబడిదారులు బయటకు రావడం.. ఈ అన్ని పరిణామాలు కలిసి బంగారాన్ని మళ్లీ “అల్టిమేట్ సేఫ్ అసెట్”గా నిలబెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 5,500 డాలర్లను దాటడం ఆర్థిక నిపుణులకే కాదు, కేంద్ర బ్యాంకులకూ ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే క్రిప్టో ప్రపంచంలో అతి పెద్ద స్టేబుల్కాయిన్ జారీదారైన టెథర్ హోల్డింగ్స్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు గ్లోబల్ ఫైనాన్స్లో హాట్ టాపిక్గా మారింది.
క్రిప్టో నుంచి కట్టుదిట్టమైన బంగారానికి టెథర్ మలుపు..
డిజిటల్ ఆస్తులకన్నా భౌతిక బంగారమే భవిష్యత్తుకు బలమైన రక్షణ అన్న నిర్ణయానికి టెథర్ వచ్చిందన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. టెథర్ CEO పాలో అర్డోయినో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డాలర్ విలువ క్రమంగా తగ్గుతున్న కాలంలో, బంగారం రుణ రహితమైన, రాజకీయ ప్రభావాలకు లోబడని ఆస్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యూహంలో భాగంగానే టెథర్ స్విట్జర్లాండ్ లోని ఒక మాజీ హై-సెక్యూరిటీ న్యూక్లియర్ బంకర్లో దాదాపు 140 టన్నుల బంగారాన్ని నిల్వ చేసింది. దీని విలువ సుమారు 24 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడుతోంది. గత ఏడాదిలోనే 70 టన్నులకుపైగా బంగారాన్ని కొనుగోలు చేసిన టెథర్, ఇప్పటికీ వారానికి ఒకటి నుంచి రెండు టన్నుల వరకు కొనుగోళ్లు కొనసాగిస్తోంది.
బంగారం కొనుగోళ్లతో కేంద్ర బ్యాంకులకు పోటీ..?
టెథర్ చేపట్టిన ఈ భారీ బంగారం కొనుగోళ్లు గోల్డ్ ETFలు, కేంద్ర బ్యాంకులతో నేరుగా పోటీ పడే స్థాయికి చేరుకున్నాయి. ఈ కొనుగోళ్లకు అవసరమైన నిధులు టెథర్ జారీ చేసే USDT స్టేబుల్కాయిన్ లాభాల నుంచే సమకూరుతున్నాయి. ఈ బంగారం నిల్వలు రెండు విధాలుగా కీలకంగా మారాయి. ఒకవైపు సంస్థ ఆర్థిక భద్రతకు రిజర్వ్ ఆస్తిగా ఉపయోగపడుతుండగా, మరోవైపు టెథర్ విడుదల చేసిన బంగారం ఆధారిత డిజిటల్ టోకెన్ XAUTకు పునాదిగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో టోకనైజ్డ్ గోల్డ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తుందని టెథర్ అంచనా వేస్తోంది.
బులియన్ ట్రేడింగ్లోకి అడుగుపెట్టిన టెథర్..
ఇంతటితో టెథర్ వ్యూహం ఆగలేదు. బంగారాన్ని కేవలం నిల్వ చేయడమే కాకుండా, దానిని చురుకుగా ట్రేడింగ్ చేయాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే HSBC వంటి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సీనియర్ బులియన్ ట్రేడర్లను నియమించుకుంది. మార్కెట్లోని అసమర్థతలను వినియోగించుకుంటూ, పెద్ద బులియన్ బ్యాంకులకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నదే టెథర్ దీర్ఘకాలిక వ్యూహంగా తెలుస్తోంది. అదే సమయంలో గోల్డ్ రాయల్టీ కంపెనీల్లోనూ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతోంది.

2025లో బంగారం ధరలు దాదాపు 65 శాతం పెరగడంలో టెథర్ ఒక్కటే కారణం కాకపోయినా, సంస్థ చేసిన భారీ కొనుగోళ్లు మార్కెట్ దిశను ప్రభావితం చేసిన మాట వాస్తవం. అయితే డాలర్ కాని ఆస్తులపై అధిక ఆధారపడటం రిస్క్లకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా, బంగారం–డిజిటల్ ఆస్తుల కలయిక భవిష్యత్తు గ్లోబల్ ఫైనాన్స్ను కొత్త దిశగా నడిపించే సంకేతాలివ్వడం ఖాయం.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team,Published: January 29, 2025 | 08:31 AM
