HomePolitical Newsప్రజల మనిషి.. ప్రగతి సారథి: బోథ్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన ఆడే గజేందర్

ప్రజల మనిషి.. ప్రగతి సారథి: బోథ్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన ఆడే గజేందర్

నిరంతరం పల్లెబాట పడుతూ కార్యకర్తలకు, సామాన్యులకు అండగా నిలుస్తూ .. తన సేవా దృక్పథంతో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు విశేష విజయాలు అందించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ.. ప్రజలతోనే ప్రయాణం.. ప్రజల కోసమే పోరాటం చేస్తూ తిరుగులేని ప్రజా నాయకుడి స్థాయికి ఎదుగుతున్న  బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ గారికి 47వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం…

గత ఎన్నికల అనంతరం గడిచిన మూడేళ్ల కాలంలో బోథ్ నియోజకవర్గ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఆ మార్పుల మధ్య ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, గ్రామ గ్రామాన పర్యటిస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తున్న నాయకుడిగా ఆడే గజేందర్ గారు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఎన్నికల అనంతరం కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గాన్ని తన కుటుంబంలా భావిస్తూ పనిచేస్తున్న ఇంచార్జిలలో ఆడే గజేందర్ గారు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం బోథ్ నియోజకవర్గంలో ఆయన పేరు తెలియని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రజలు మరియు కార్యకర్తలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం ఆయన రాజకీయ బలంగా మారింది.

గ్రామ గ్రామానికి విస్తరించిన సేవలు..

ఎలాంటి హడావుడి లేకుండా.. పెద్దగా ప్రచారం చేసుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగడం ఆడే గజేందర్ గారి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. బోథ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఆయన సేవలు చాపకింద నీరులా విస్తరించాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా స్పందించడం, అవసరమైన సమయంలో అండగా నిలవడం, ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలతో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. పార్టీలకు అతీతంగా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలతోనూ మంచి బాండింగ్ ఏర్పరుచుకోవడం ఆయనకు ప్రత్యేకమైన ప్రజా నాయకుడి ఇమేజ్‌ను తీసుకొచ్చింది.

ప్రజలతోనే బలం.. కార్యకర్తలతోనే ముందడుగు..

రాజకీయాల్లో పదవులు, ఎన్నికలు మాత్రమే కాకుండా ప్రజలతో ఉండే సంబంధాలే నిజమైన బలమని నమ్మే నాయకుడిగా ఆడే గజేందర్ గారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌తో పాటు వ్యక్తిగతంగా కూడా తన గ్రాఫ్‌ను సమాంతరంగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో ఏర్పడిన బలాన్ని గత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా ప్రతిబింబించాయి.

10 మండల కేంద్రాల్లో 6 మండల కేంద్రాలను కైవసం చేసుకోవడంతో పాటు.. దాదాపు 110కు పైగా సర్పంచ్ స్థానాల్లో విజయాన్ని సాధించడం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిన బలమైన గ్రామస్థాయి పునాదికి నిదర్శనంగా నిలిచింది. ఈ విజయాలు కేవలం ఎన్నికల ఫలితాలుగానే కాకుండా.. గ్రామస్థాయిలో కార్యకర్తలతో ఏర్పడిన సమన్వయం, ప్రజలతో కొనసాగుతున్న సంబంధాలు, పార్టీ బలోపేతం కోసం జరుగుతున్న నిరంతర కృషికి ప్రతిబింబంగా నిలిచాయి.

అధిష్ఠానం వద్ద తిరుగులేని గుర్తింపు..

బోథ్ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ, పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహించడంలోనూ ఆడే గజేందర్ గారు ముందుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వద్ద కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, అధిష్ఠానం నమ్మకాన్ని పొందే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడిగా ప్రారంభమైన ఆడే గజేందర్ గారి రాజకీయ ప్రయాణం.. నేడు బోథ్ నియోజకవర్గంలో ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందే స్థాయికి చేరుకుంది. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్య ఉండే రాజకీయానికి భిన్నంగా.. ఎన్నికలు లేని సమయంలోనూ ప్రజల మధ్య ఉండటం, గ్రామాలను సందర్శించడం, కార్యకర్తలను కలవడం, సమస్యలను తెలుసుకోవడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రజల మధ్య ఉండటం.. ప్రజల సమస్యలపై స్పందించడం.. కార్యకర్తలకు అండగా నిలవడం.. గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయడం.. ఇవే ఆడే గజేందర్ గారి రాజకీయ ప్రయాణానికి బలమైన పునాదులుగా నిలుస్తున్నాయి.

మరో అడుగు.. మరింత బలమైన భవిష్యత్..

ఆగస్టు 23న జన్మదినం జరుపుకున్న ఆడే గజేందర్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల అండదండలతో, మరింత ఉన్నత స్థాయికి ఎదిగి.. బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మరింతగా సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలతోనే ప్రయాణం.. ప్రజల కోసమే పోరాటం.. బోథ్ భవిష్యత్తు కోసం నిరంతర కృషి — ఇదే ఆడే గజేందర్ గారి రాజకీయ ప్రస్థానం…ఆడే గజేందర్ గారికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…

వ్యాసకర్త : యం.డి. సద్దాం, బోథ్ అసెంబ్లీ మాజీ అధికార ప్రతినిధి

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular