• కష్టపడి బతికేవాడిపై మత ముద్ర వేస్తారా..? భగ్గుమన్న సోషల్ మీడియా
• అండగా నిలిచిన లోకేష్, నెటిజన్లు!
• కోవా బన్లో వాడేది పాలు, చక్కెర, రవ్వేనని వలి స్పష్టత
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్న వేళ, అక్కడ ‘కోవా బన్’ (Kova Bun) అమ్ముకుంటున్న ఓ చిన్న వ్యాపారిపై జరిగిన మీడియా దాడి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ‘ఫుడ్ జిహాద్’ (Food Jihad) పేరుతో సదరు వ్యాపారిని ఓ మీడియా ప్రతినిధి, మరికొందరు ప్రశ్నించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ కోవాబన్ టాపికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చగా మిగిలింది.
అసలేం జరిగింది..? ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
మేడారం జాతరలో వలి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కోవా బన్ స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఓ యూట్యూబ్(మీడియా ఛానల్ ప్రతినిధి) అక్కడికి చేరుకుని, మీరు విక్రయిస్తున్న ఆహారంలో మీరు అమ్ముతున్న ఈ కోవా బన్ ఎక్స్పైరీ డేట్ ఉందా..? ఏమైనా కలుపుతున్నారా..? ఇది ‘ఫుడ్ జిహాద్’లో భాగమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అమాయకంగా కనిపించిన వలి, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపడుతూ తన వ్యాపారం గురించి వివరించే ప్రయత్నం చేశారు. సదరు జర్నలిస్టు మైక్ పెట్టి, మతపరమైన కోణంలో నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం రాజుకుంది.
ఇందులో కల్తీ లేదు.. కష్టం మాత్రమే ఉంది : వలి వివరణ
తనపై వచ్చిన ఆరోపణలపై వలి, అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము బతకడానికి ఈ వ్యాపారం చేస్తున్నాం తప్ప, ఎవరినీ మోసం చేయడానికి కాదు. కోవా బన్ తయారీలో కేవలం పాలు, చక్కెర, బొంబాయి రవ్వ మాత్రమే వాడతాం. ఇందులో ఇతర నిషేధిత పదార్థాలు కానీ ఉండవు. కావాలంటే టెస్ట్ చేయించుకోవచ్చు అని వలి కన్నీటి పర్యంతమయ్యారు. జాతరలో అందరూ కలిసిమెలిసి ఉంటారని, తమపై ఇలాంటి నిందలు వేయడం బాధాకరమని ఆయన వాపోయారు.
సోషల్ మీడియాలో మద్దతు వెల్లువ.. ఏంటీ ఫుడ్ జిహాద్?
వలిని ప్రశ్నించిన తీరును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. “కడుపు నింపుకోవడానికి కోవా బన్ అమ్ముకునే వాడిలో కూడా మతాన్ని చూస్తారా?” అని ఫుడ్ బ్లాగర్లు ప్రశ్నిస్తున్నారు. ఆహారానికి మతం రంగు పులిమి, ‘ఫుడ్ జిహాద్’ అంటూ కొత్త పదాలను సృష్టించడం సరికాదని, ఇది జర్నలిజం విలువలకే విరుద్ధమని పలువురు అభిప్రాయపడ్డారు. #SupportVali, #KovaBun వంటి హ్యాష్ట్యాగ్లు ప్రస్తుతం ట్విట్టర్ (X)లో ట్రెండ్ అవుతున్నాయి.
అండగా నిలిచిన మంత్రి లోకేష్, ప్రముఖులు
ఈ వివాదం ఏపీ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ఆయన స్పందిస్తూ వలికి భరోసా ఇచ్చారు. “కష్టపడి పనిచేసే వారిని కులం, మతం పేరుతో వేధించడం సరికాదు. శ్రమజీవులకు అండగా ఉండాలి,” అనే ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేసినట్లు సమాచారం. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వలికి మద్దతుగా నిలుస్తున్నారు. చిన్న వ్యాపారులను ఇలా భయభ్రాంతులకు గురిచేయడం వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
జాతర స్ఫూర్తి ఐక్యమత్యం
మేడారం జాతర అంటేనే కులమతాలకు అతీతంగా జరిగే పండుగ. అక్కడ కోవా బన్ అమ్మే వలి అయినా, బెల్లం అమ్మే మరో వ్యాపారి అయినా అందరూ అమ్మవార్ల సేవలో, ఉపాధి వేటలో ఉన్నవారే. ఒక చిన్న స్వీట్ ఐటమ్పై ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం, దానికి మతపరమైన రంగు పులమడం అనవసరమని మేధావులు అంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యతను పరీక్షించడం వేరు, మీడియా కెమెరాలతో వెళ్లి భయపెట్టడం వేరు అని ప్రజలు గుర్తిస్తున్నారు.

