• కొత్తగూడలో లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు
•రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం
వాస్తవ నేస్తం, హైదరాబాద్ : CM రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొత్తగూడలో రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఆయన సామూహిక గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కాగజ్నగర్ X-Road వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరై, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాని’కి CM లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని CM ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే వేదిక నుంచి జిల్లాకు చెందిన పలు అభివృద్ధి పనులకు CM శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలన..
CM పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను తుది దశకు చేర్చింది. ఈ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కాగజ్నగర్కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:00 గంటకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి Vande Bharat Express లో బయలుదేరి సాయంత్రం 4:00 గంటల ప్రాంతంలో ఆయన కాగజ్నగర్ చేరుకుంటారు. అనంతరం CM సభా ప్రాంగణం, Parking, Helipad తదితర ఏర్పాట్లను పరిశీలించి స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.
