వాస్తవ నేస్తం,ఇచ్చోడ : సమాజంలో స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఓ యువకుడు తన నిజాయితీని చాటుకున్నాడు. దొరికిన విలువైన వస్తువును సొంతం చేసుకోవాలనుకోకుండా, సంబంధిత అధికారులకు అప్పగించి మానవత్వానికి మారుపేరుగా నిలిచాడు. నాలుగు రోజుల క్రితం
ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఖలీల్ అనే యువకుడు తన వ్యక్తిగత పని నిమిత్తం ఆదిలాబాద్కు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఆదిలాబాద్ నుండి ఇచ్చోడకు ఆర్టీసీ బస్సులో ప్రయాణ క్రమంలో బస్సు సీటు వద్ద ఎవరిదో మర్చిపోయిన ఒక ఖరీదైన ల్యాప్టాప్ అతనికి దొరికింది.
దానిని చూసి ఏమాత్రం ప్రలోభాలకు గురికాని ఆ యువకుడు, వెంటనే ఆ ల్యాప్టాప్ను తీసుకువెళ్లి ఇచ్చోడ బస్టాండ్లోని ఆర్టీసీ కంట్రోలర్కు అందజేశాడు. ప్రయాణికులు ఎవరైనా వెతుక్కుంటూ వస్తే వారికి అప్పగించాలని కోరాడు. ఖలీల్ ప్రదర్శించిన నిజాయితీకి స్థానికులు, ఆర్టీసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన వస్తువు దొరికినా ఆశపడకుండా తిరిగి ఇచ్చేసిన ఖలీల్.. నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
