📄 ePaper
Thursday, May 21, 2026
📄 ePaper
HomeAgricultureఅగ్గిపాలైన అన్నదాత ఆశలు.. 100 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద

అగ్గిపాలైన అన్నదాత ఆశలు.. 100 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద

• బోథ్ మండలం కన్గుట్ట గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం

• చేతికొచ్చిన పంట కాలిమసి.. సుమారు 40 మంది రైతులకు తీరని నష్టం

• ఎండ, గాలి తీవ్రతతో దావానలంలా వ్యాపించిన మంటలు

• కోత యంత్రాల కొరతే కొంపముంచిందంటున్న అన్నదాతలు

• మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది, రైతుల శ్రమ

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. ఇంకొద్ది రోజుల్లో ఇంటికి చేరుతుందనుకున్న అన్నదాతల ఆశలు అగ్గిపాలయ్యాయి. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వారి కళ్లెదుటే సుమారు 100 ఎకరాల మొక్కజొన్న పంటను బూడిద చేశాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామ శివారులో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

కన్గుట్ట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో ప్రమాదవశాత్తు మొక్కజొన్న చేలలో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, దానికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు దావానలంలా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే వందల ఎకరాలకు అంటుకున్నాయి. కన్గుట్ట శివారులో ప్రారంభమైన మంటలు.. పక్కనే ఉన్న సాకిర గ్రామ శివారు వ్యవసాయ భూముల్లోకి కూడా వేగంగా విస్తరించాయి. పంట పూర్తిగా ఎండిపోయి, కోత దశలో ఉండటంతో అగ్ని కీలలు మరింత ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.

హార్వెస్టర్ల కొరతే శాపమైందా..?

పంట చేతికొచ్చిన సమయంలో ఈ ఘోరం జరగడం రైతులను కలచివేస్తోంది. వాస్తవానికి మొక్కజొన్న అంతా కోతకు సిద్ధంగా ఉంది. అయితే, ప్రాంతమంతా ఒకేసారి కోతలు ప్రారంభం కావడం, హార్వెస్టర్ల (కోత యంత్రాల) కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు తమ వంతు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఈ లోపే ఊహించని రీతిలో అగ్నిప్రమాదం జరగడంతో కన్గుట్ట పరిధిలోని సుమారు 40 మందికి పైగా రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

A devastating fire reduces 100 acres of ready-to-harvest maize crops to ashes in Boath mandal, Adilabad district.

మంటల తీవ్రతను గమనించిన స్థానికులు, రైతులు వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికారులతో పాటు స్థానిక రైతులు, గ్రామస్తులు కూడా మంటలను అదుపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కన ఉన్న పొలాలకు మంటలు అంటుకోకుండా నిరోధించేందుకు తీవ్ర ఉత్కంఠ మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు వ్యవసాయ రంగాన్ని, రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తిచేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular