• చేతిలోనే పేలిన బాంబు.. కార్యకర్త పరిస్థితి విషమం
వాస్తవ నేస్తం,పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల వేళ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రచార హోరులో భాగంగా మిన్నంటిన ఉత్సాహం ఒక కార్యకర్త జీవితంలో చీకట్లు నింపింది. బాంబు షాట్స్ కాలుస్తున్న క్రమంలో అవి చేతిలోనే పేలిపోవడంతో ఒక పార్టీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సోమవారం ఉదయం ఒక అభ్యర్థి తరపున కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, నినాదాలతో ప్రచారం సాగుతుండగా, కార్యకర్తల్లో ఉత్సాహం పెల్లుబికింది. ఈ క్రమంలోనే ఒక కార్యకర్త అతి ఉత్సాహంతో, సాధారణంగా నేల మీద ఉంచి వెలిగించాల్సిన ‘బాంబు షాట్స్’ గొట్టాన్ని చేతిలో పట్టుకుని వెలిగించారు. దీంతో బాంబు షాట్స్ చేతిలో పేలడంత కార్యకర్త చేయి తీవ్రంగా చిద్రమైంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. బాంబు చేతిలోనే పేలడంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే తోటి కార్యకర్తలు, స్థానికులు స్పందించి ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల సమయంలో బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, కార్యకర్తలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రాణాపాయం ఉన్న బాంబులను చేతులతో పట్టుకుని కాల్చడం వంటి సాహసాలు చేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

