• రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నీటి పారుదల శాఖ ఈఈ, ఏఈ
• పౌల్ట్రీ ఫామ్ ఎన్ఓసీ కోసం లంచం డిమాండ్ చేసిన ఉన్నతాధికారులు
• సోనాలకు చెందిన బాధితుడి వద్ద రూ. 60 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈఈ, ఏఈ
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పనులు చేసిపెట్టడానికి ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఈ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా సోనాల గ్రామానికి చెందిన చౌహాన్ విక్రమ్ సింగ్ అనే వ్యక్తి కొత్తగా విమల పౌల్ట్రీ ఫామ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ తప్పనిసరి కావడంతో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఈ ఎన్ఓసీ మంజూరు చేయడానికి నీటి పారుదల శాఖ ఈఈ రాథోడ్ విట్టల్, ఏఈ రమేష్లు భారీగా లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విక్రమ్ సింగ్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో బాధితుడు చౌహాన్ విక్రమ్ సింగ్ నుంచి రూ. 60,000 లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి, ఈఈ రాథోడ్ విట్టల్, ఏఈ రమేష్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
