వాస్తవ నేస్తం,హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ఎత్తుగడలు తెరపైకి వస్తాయో ఎవరూ ఊహించలేరు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఎవరికీ కనీస సమాచారం లేకుండా, అత్యంత గోప్యంగా సాగిన ఒక ఆపరేషన్ నేడు అనూహ్యంగా వెలుగుచూసింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఏవేవో పార్టీ పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఎవరి అంచనాలకు అందని విధంగా తన పార్టీకి “టీఆర్ఎస్” (తెలంగాణ రాష్ట్ర సేన – TRS) అని నామకరణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తండ్రి, అన్నలకు ‘మాస్టర్ స్ట్రోక్’!
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి, సెంటిమెంట్కు మారుపేరు టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి). జాతీయ రాజకీయాల కోసం అధినేత కేసీఆర్ దానిని బీఆర్ఎస్ గా మార్చారు. సరిగ్గా ఇప్పుడు కవిత అదే పాయింట్ను తన ఆయుధంగా మలుచుకున్నారు. తన పార్టీకి “తెలంగాణ రాష్ట్ర సేన (TRS)” అని పేరు పెట్టడం ద్వారా.. తండ్రి కేసీఆర్, అన్నయ్య కేటీఆర్, బావ హరీష్ రావులకు పక్కా రాజకీయ ‘మాస్టర్ స్ట్రోక్’ ఇచ్చారనే చర్చ నడుస్తోంది.
‘పాంచజన్యం’ పేరుతో భారీ హామీలు :
కేవలం పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో ప్రజల కోసం ఏం చేయబోతున్నారో వివరిస్తూ ‘పాంచజన్యం’ పేరుతో హామీల చిట్టాను కవిత విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా:
- మహిళా సాధికారతకు పెద్దపీట వేయడం.
- యువతకు ఉపాధి కల్పనపై స్పష్టమైన హామీలు.
- రైతు సంక్షేమం కోసం వినూత్న పథకాల ప్రకటన.
బిఆర్ఎస్ శ్రేణుల సెటైర్లు: “ఇది ఒరిజినల్ కాదు!”
కవిత కొత్త పార్టీ “TRS” ప్రకటన బయటకు రాగానే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు విమర్శల దాడి ప్రారంభించారు. “అక్షరాలు (TRS) కలిసినంత మాత్రాన, కేసీఆర్ గారి ఇమేజ్ రాదు” అని వారు ఎద్దేవా చేస్తున్నారు.
“ఇది డూప్లికేట్ టీఆర్ఎస్.. ప్రజలు అంత అమాయకులు కాదు” అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. పార్టీ పేరు విషయంలో ఇంత పెద్ద రిస్క్ తీసుకున్న కవితకు ప్రజలు ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

